*ప్రత్యేక శిక్షణల ద్వారా బీఎల్వోలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి*
*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
*విశాఖపట్టణం పున్నమి ప్రతినిధి * కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల ఆదేశాల మేరకు చేపట్టే అన్ని రకాల ప్రక్రియలపై, అంశాలపై బీఎల్వోలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, ఆ మేరకు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక కలెక్టరేట్ వీసీ హాలు నుంచి భాగస్వామ్యమైన కలెక్టర్ విశాఖపట్టణం జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, మ్యాపింగ్ ప్రక్రియలు, ఇతర అంశాలపై నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి అధికారులకు శిక్షణ సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తాజాగా ఈ నెల 25వ తేదీన బీఎల్వోలకు శిక్షణ అందించామన్నారు. ఎప్పుడొచ్చిన దరఖాస్తులను అప్పుడే పరిశీలించి తగిన చర్యలు చేపడుతున్నామని, పెండింగ్ లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఒక ఈఆర్వో, ఒక ఏఈఆర్వో స్థానాలను భర్తీ చేయాల్సి ఉందని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.
వీసీ అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే అవసరాలను, జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే అందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రీ ఎస్.ఐ.ఆర్. నేపథ్యంలో 2002 జాబితాను 2025 ఓటర్ల జాబితాతో సరిచూసి పరిశీలించాలని చెప్పారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోవాలన్నారు. రోజుకో గంట సమయం కేటాయించాలని, బీఎల్వోలకు క్రమం తప్పకుండా శిక్షణలు ఇస్తూ అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు సూచించారు. బీఎల్వోలు కచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, మ్యాపింగ్ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, పోస్టమెన్ల సహకారం తీసుకోవాలని హితవు పలికారు. ఎక్కడైనా బీఎల్వోలు లేకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఆర్వోలను ఆదేశించారు.
కార్యక్రమంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎలక్షన్ డీటీలు, ఎలక్షన్ సెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


