ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఫిర్యాదుదారులతో సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాలని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడ్డానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తేల్చి చెప్పారు. ఆడిట్ నివేదికల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి వచ్చిన స్పందన, సంతృప్తి తదితర నివేదికల సునిశిత పరిశీలన అనంతరం కలెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర అధికారులతో, సిబ్బందితో ఫోన్లు చేయించి తూతూమంత్రంగా ఎండార్స్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని, ప్రతీ ఫిర్యాదుదారుతో అధికారులు తప్పకుండా మాట్లాడాల్సిందేనని ఉద్ఘాటించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు, అధికారులు తీసుకున్న చర్యలు, ఇచ్చిన నివేదికలను క్షుణ్నంగా పరిశీలించిన ఆయన అధికారులు ఫిర్యాదుల పరిష్కారంలో మరింత చొరవ చూపాలని, కాలయాపన చేయకుండా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట కలెక్టర్ కె. మయూర్ అశోక్ తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. సమస్యపై పూర్తి అవగాహనతో ఉండాలని, నాణ్యమైన పరిష్కారం చూపడం ద్వారా ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడొచ్చన్నారు. ఫిర్యాదు స్థితిగతులపై ప్రజలకు విడమరిచి చెప్పాలన్నారు.
పీజీఆర్ఎస్ లో భాగంగా ప్రజలు వివిధ సమస్యలపై 413 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 148, జీవీఎంసీకి చెందినవి 126, పోలీస్ శాఖకు సంబంధించి 32, ఇతర శాఖలకు సంబంధించినవి 107 ఫిర్యాదులు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎఎంసీ అదనపు కమిషనర్ వర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


