సీఎం రాకతో ఉదయగిరి అభివృద్ధికి నూతన దిశ – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో శోభాయమానంగా ముస్తాబైంది. “పేదల సేవలో” భాగంగా నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సీఎం రేపు విచ్చేయనున్న నేపథ్యంలో అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.ఈ ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమ స్థలంలో భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజల కోసం కూర్చోవడానికి సౌకర్యాలు, రాకపోకల సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు అందించారు.ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా వంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు.
అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, రాబోయే రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గానికి మరింత అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, నియోజకవర్గ ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.



