నందలూరు మండల వ్యాప్తంగా దోమల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాల చుట్టుపక్కల, కాలనీలలో, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల అధికమైంది. ఫలితంగా పట్టపగలే దోమలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
మండలంలోని ప్రధాన వీధులు, నివాస కాలనీలు, పాఠశాలల పరిసరాలు, అంగన్వాడీ కేంద్రాలు, డ్రైనేజీలు దోమల పుట్టిల్లుగా మారాయి. సాయంత్రం వేళ ఇళ్లలో ఉండడం కూడా కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి, దురద, జ్వరాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నప్పటికీ సంబంధిత ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేలు, డ్రైనేజీ శుభ్రత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు.
గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక దోమల నివారణ డ్రైవ్ చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.


