అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి(ఆనంద్) : ఎలమంచిలి నియోజకవర్గం ధర్మవరంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఘాటైన రాజకీయ సందేశం ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన, ప్రజా సమస్యలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ధర్మవరం అభివృద్ధికి తాను పూర్తి కట్టుబడి ఉన్నానని, కూటమి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతమైన చర్యలు చేపడతామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ భేదాలు అడ్డుకావని, ప్రజాహితం కోసం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


