రాజమహేంద్రవరం :
దేశ రక్షణ, సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషిచేసాయని, ఇందిర, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. భారతరత్న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్థంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. బ్యాంకుల జాతీయికరణ, రాజాభరణాల రద్దు, 20 సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయన్నారు. అటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు. ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వాది అని, ఆయన ఉప ప్రధాని పదవిని కూడా నిర్వహించారన్నారు. మొంధా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో పంట నాశనం అయ్యిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. కొత్తరుణాలు, ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాల కృషి వల్లనే నేడు దేశం ఈ విధంగా ఉందన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతతత్వ పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ తీరును అందరూ గ్రహించాలన్నారు. సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశ సేవకు ప్రాణాలర్పించిన ఇందిర గాంధీ త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఇందిరా గాంధీని ప్రశంసించారన్నారు. కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, నల్లా వీర్రాజు, గట్టి నవతారకేష్, కాటం రవి, బత్తిన చంద్రబాబు, యిజ్జరౌతు సత్యనారాయణ, యాళ్ల మాచరయ్య, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


