విశాఖపట్నం, నవంబరు 24:
ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు, జగద్గురుపీఠం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. యస్. శాస్త్రి (89) సోమవారం ఉదయం అక్కయ్యపాలెంలోని తన నివాసంలో కన్నుమూశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుమారుడు కె. శ్రీనివాస్ తెలిపారు.
మాస్టర్ ఈ.కె. నుండి దివ్యస్ఫూర్తిని పొందిన డా. శాస్త్రి, యాభై ఏళ్లకు పైగా నిస్వార్థంగా హోమియో వైద్య సేవలందించారని జగద్గురుపీఠం కార్యనిర్వాహక బృందం భావోద్వేగంతో స్మరించుకుంది. వేలాది మంది రోగులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సభ్యులు పేర్కొన్నారు.
జగద్గురుపీఠం జాతీయ గౌరవాధ్యక్షునిగా, అలాగే ‘మాస్టర్ హోమియో వైద్యాలయం’ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ఆదర్శనీయంగా నిర్వహించారని సంస్థ కార్యదర్శి బి.ఆర్.కె. రాజు తెలిపారు.
మాస్టర్ ఈ.కె పేరిట ‘హోమియో టీచింగ్ సెంటర్’ ను స్థాపించి, వందలాదిమందికి హోమియో వైద్య బోధన అందించిన విషయాన్ని సంస్థ ఉపాధ్యక్షులు ఎన్.వి.యస్. మూర్తి గుర్తుచేశారు. ఆయన రచించిన హోమియో గ్రంథాలు వైద్య రంగానికి విశిష్టమైన దోహదం చేశాయని తెలిపారు.
మాస్టర్ సీవీవీ గురుపూజలు, హోమియో జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో డా. శాస్త్రి చేసిన సేవలను సంస్థ గౌరవ్ డైరెక్టర్ అజ్జరపు శ్రీనివాస్ ప్రశంసించారు. ‘హోమియో బ్రదర్ హుడ్’ పత్రికా సంపాదకునిగా, ‘బాలభాను విద్యాలయం’ మరియు ‘హోమియో స్పిరిచ్యువల్ సర్వీస్ మిషన్’ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారని డైరెక్టర్ చింతలపాటి పేర్కొన్నారు.
మాస్టర్ ఈ.కె. ప్రసంగించిన పతంజలి యోగ సందేశాలను పుస్తక రూపంలో అందించడంలో డా. శాస్త్రి చేసిన కృషి అమూల్యమని ‘కులపతి బుక్ ట్రస్ట్’ ఛైర్మన్ ఎస్.హెచ్.యస్.ఎన్. రాజు కొనియాడారు. 1992–1998 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవ హోమియో వైద్యునిగా పనిచేసి వేలాది మందికి వైద్యం అందించారని డా. జి.ఏ. రామేశ్వర్ గుర్తుచేశారు.
డా. శాస్త్రి పార్ధివదేహానికి ‘మాస్టర్ హోమియో వైద్యాలయం’ సేవకులు, జగద్గురుపీఠం సభ్యులు, అలాగే డా. డి.వి. భాస్కరరావు, డా. బి. వంశీకృష్ణతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు.


