*దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి అనిత సమీక్ష*
*అమరావతి ( విశాఖ పున్నమి ప్రతినిధి):- *:- నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు (శనివారం) సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు.


