అన్నమయ్యపురంలో దశావధాన సురభిళం
శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని, “మీతో” సంస్థల సంయుక్త నిర్వహణలో భాగ్యనగరం హైటెక్ సిటీ అన్నమయ్య సదన్ కళావేదికలో జరిగిన శ్రీ సురభి శంకరశర్మ దశావధానం ఆద్యంతం రసజ్ఞులను అలరింపజేసింది.
ఈ
అవధానానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వేంకటరెడ్డి సంచాలకులుగా వ్యవహరించారు. ప్రాశ్నికులుగా నిషిద్ధాక్షరి౼వాడవల్లి బాలకృష్ణమూర్తి,న్యస్తాక్షరి౼డా||పి.కమలసుధారాణి, దత్తపది౼డా||పొన్నెకంటి సూర్యనారాయణ, సమస్య౼టి.భ్రమరాంబిక, వర్ణన౼డా||జిల్లెళ్ళ వరప్రసాద్, ఆశువు౼సింగం ఫణికుమార్, కావ్య పఠనం౼ఓర్చు రాజారాం, మీమాట నాపాట౼వారణాసి కోటేశ్వరశర్మ, ఘంటాగణనం౼ పి.లింగమూర్తి, అప్రస్తుత ప్రసంగం౼వేపా పార్వతీశం వ్యవహరించారు.
దత్తపది అంశంలో మోడీ,పుతిన్,ట్రంపు,కిమ్ పదాలను యిచ్చి భారతార్థంలో శార్దూల వృత్తంలో కోరగా,
‘ఒమ్మున్ జేయగ జూచు కౌరవులు మి”మ్మోడి”ంచుటే ధ్యేయమై
నమ్మన్ బిల్చియు చం”పుతిన్న”గను
విన్నాణంబు చూపించుచున్
సమ్మోదంబగు నెట్లు సంధిమనకున్ చ”ట్రంపు” బంధాలతో,
“కిమ్మీ”రాంతక, భీమసేన వినుమా, కీడెంచి మేలెంచుమా.
అని ద్రౌపది భీమ సేనునితో అన్ననట్లుగా అవధాని పూరించారు. సమస్య అంశంలో౼”కోకిల కూయుచుండగను కూయుచునుండెను కాకులన్నియున్ “అని ఇవ్వగా౼ ‘ప్రాకట వృద్ధి రాగములు భారతమందున వచ్చె మోడితో
కేకలు వేసి కొందరిట కీడుదలంప ప్రధాని గారిపై
మైకము కమ్మి వాగెదరు మాన్యత వీడియు దుష్టబుద్ధితో
కోకిల కూయుచుండగను కూయుచునుండెను కాకులన్నియున్’ అని పూరించారు.
మీమాట- నా పాట అంశములో అన్నమాచార్యుని పదశోభపై పాటను కోరగా
అన్నమయ్య అన్నమయ్య -తెలుగు జాతి ఖ్యాతివయ్య
తాళ్ళపాక అన్నమయ్య- పదకవితల ధాతవయ్య
నీపాటల సప్తగిరుల ఎదిగి ఎదిగి పొంగెనయ
నీమాటల భక్తజనుల ఒదిగి ఒదిగి సాగెనయ
అంటూ పూరించారు.
అవధానానంతరం ప్రాశ్నికులను,అవధానిని అన్నమాచార్యభావనావాహిని అధ్యక్షులు పద్మశ్రీ డా|| శోభారాజ్ ఘనంగా సత్కరించారు



