రైతులకు ఇచ్చేముందు మరోసారి పూర్తి స్థాయి పరిశీలన
ఇప్పటికీ వెంటాడుతున్న గత ప్రభుత్వ పాపాలు
పంపిణీకి సిద్దంగా 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు
రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
అమరావతి: గత ముఖ్యమంత్రి ఫోటోల పిచ్చితో తన బొమ్మను ముద్రించుకున్న పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎటువంటి తప్పులకు అస్కారం లేకుండా పకడ్బందీగా సమాచారాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించి ప్రింట్ చేయిస్తున్నట్లు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంపుల శాఖా మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని, ఇంతవరకు తప్పులతో ఒక్క పాస్ పుస్తకం కూడా ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లోని రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ఇందు కోసం 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని కోరారు.
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలపై అపోహలు
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో 50 శాతం పుస్తకాల్లో తప్పుల తడకలే ఉన్నాయంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వం కాలంలో హాడావిడిగా చేసిన రీ సర్వే కారణంగా చాలా తప్పులు దొర్లాయని, వారిచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల్లోనూ ఆ తప్పులు ఉన్నాయని చెప్పారు. అయితే వీటిని సరి చేసేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ సర్వే జరిగిన 6688 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా 2 లక్షల 79 వేల అర్జీలు వచ్చాయని, వాటన్నంటినీ వంద శాతం పరిష్కరించామని చెప్పారు. అంతే కాక ఆ తర్వాత 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, వాటిల్లో వచ్చిన లక్షా 85 వేల అర్జీలను వంద శాతం పరిష్కరించామని చెప్పారు. వీటి తర్వాత ఇంకా తమ భూముల వివరాలకు సంబంధించి, పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులకు సంబంధించి ఎవరైనా భూ యజమానులు ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు నాలుగు నెలల సమయాన్ని కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో రైతులు, భూ యజమానుల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి రికార్డులను లైవ్ వెబ్ ల్యాండ్ లో సరి చేసినట్లు చెప్పారు. ఆ లైవ్ వెబ్ ల్యాండ్ లో ఉన్న డేటానే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో ముద్రించినట్లు చెప్పారు. ముద్రణ అయిన తర్వాత కూడా మరలా జాయింట్ కలెక్టర్ కార్యాయలం స్థాయిలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాలు లైవ్ వెబల్యాండ్ డేటా ప్రకారం ఉన్నాయో లేవో క్షుణ్ణంగా పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ పక్రియ తుది దశలో ఉందన్నారు.
రైతులకు ఎటువంటి ఆందోళన వద్దు
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి కొత్త పాస్ పుస్తకాలు ముద్రించి ఇస్తామన్నారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత కూడా వాటిల్లో ఏవైనా మార్పులు కావాలని భూ యజమానులు కోరుకుంటే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి ఉచితంగా చేసి పెడతామని, కొత్త పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. జాయింట్ ఎల్పీఎమ్ ల సబ్ డివిజన్ కు సంబంధించి ఇప్పటికే లక్షకు పైగా అభ్యర్ధనలను ఎటువంటి ఫీజు తీసుకోకుండా పరిష్కరించినట్లు చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకంపై ఫోటో సక్రమంగా ఉందా లేదా అనే విషయాన్ని పంపిణీకి ముందుగానే గుర్తించి జాయింట్ కలెక్టర్లు కొత్త ఫోటోను ముద్రించి ఇస్తారని చెప్పారు. పేర్లు, జెండర్ తప్పులు ఉంటే వాటిని కూడా ముందుగానే సరి చేస్తున్నామని, పట్టాదారు పాస్ పుస్తకం అందిన తర్వాత రైతులు ప్రభుత్వానికి అభ్యర్దించినా వాటి మార్పులు ఉంటాయని చెప్పారు.
రుణాలు పొందేందుకు రైతులకు ఎటువంటి ఆటంకం లేదు
రైతులు రుణాలు పొందేందుకు పట్టాదారు పాస్ పుస్తకంతో పని లేదని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి బ్యాంకర్ కు లైవ్ వెబ్ ల్యాండ్ లోన్ చార్జ్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందని, దాని ద్వారా మాత్రమే రుణాలు ఇస్తారని, అందులో నిజమైన భూ యజమాని ఎవరో తెలిసి పోతుందని, రుణాలు పొందేందుకు పట్టాదారు పాస్ బుక్ లతో పని లేదని చెప్పారు. కౌలు రైతుల పేర్లు పట్టాదారు పాస్ పుస్తకాల్లో యజమానులుగా ప్రింట్ అయ్యానని అనడం అర్దం లేదని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై యజమాని పేరు 1బి(ఆర్వోర్) మాస్టర్ నుండి ప్రింట్ అవుతుందని, ఆర్వోరోలో కైలుదారుల పేర్లు ఉండవని, కాబట్టి వారి పేర్లు పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించే అవకాశమే లేదన్నారు. రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.


