నడిరోడ్డుపై తోపుడు బండ్లు… నగరంలో ట్రాఫిక్ జామ్
పున్నమి ప్రతినిధి, జూలై 23,ప్రకాశం జిల్లా, పామూరు: ముందుకెళ్ళేందుకు దారి లేదు, వెనక్కి తిరిగేందుకు అవకాశం లేదు.ఇది శుక్రవారం పట్టణంలోని విరువూరు రోడ్,సీఎస్ పురం రోడ్ కూడళ్ళలో ట్రాఫిక్ పరిస్థితి.నడిరోడ్లపైకి తోపుడు బండ్లు వచ్చి నిలబడుతూ ఉండడంతో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇటీవల ప్రధాన రహదారులను ఆక్రమించుకుని ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తూ వచ్చిన పంచాయితీ శాఖ విరువూరు రోడ్ లో మాత్రం పూర్తి స్థాయిలో తొలగింపును చేపట్టకుండా ఆగిపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది.దీంతో వాహనాలన్నీ రెండు వైపులా రోడ్లపై నిలబడిపోతున్నాయి.భారీ వాహనాలైతే కూడలిలోని మూల మలుపు వద్ద టర్నింగ్ తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.విరువూరు రోడ్ లో పంచాయితీ శాఖ ఆక్రమణల తొలగింపు చర్యలు మధ్యలో ఎందుకు ఆపేయవలసి వచ్చిందో అర్థం కావడం లేదని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పంచాయితీ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలు సదరు శాఖలను హెచ్చరించారు.


