గాజువాక: (పున్నమి ప్రతినిధి)
గాజువాక జోన్–6 పరిధిలోని మంగళ పాలెం జె ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై గాజువాక టిడిపి లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ముమ్మిడివరపు రాము కాలనీ ప్రతినిధులు మరియు మహిళలు కలిసి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పల్లాకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా గతంలో మాదిరిగానే తమ కాలనీని గాజువాక జోన్–6లో కొనసాగించాలని కోరుతూ వినతిపత్రంలో స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం రోజు విడిచి రోజు మాత్రమే అందుతున్న త్రాగునీటిని ప్రతిరోజూ సరఫరా చేయాలని త్రాగునీటి కొరత కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రతి నెలా పంపిణీ అవుతున్న రేషన్ సరుకులు అందరికీ సరిపోక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కాలనీకి చెందిన డిపో నంబర్–585 కు ప్రతి నెలా 300 రేషన్ కార్డులకు సరిపడా అదనపు స్టాక్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ సమస్యలను వ్యక్తపరిచారు. కాలనీ అభివృద్ధికి సహకరించి కార్యక్రమానికి హాజరైన మహిళలు, యువకులు, పెద్దలకు కాలనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.


