జీవీఎంసీ స్థాయి సంఘంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం.
– నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థాయి సంఘo సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థాయి సంఘం సమావేశంలో 257 ప్రధాన అంశాలు, 30 టేబుల్ అజెండాలతో పాటు మొత్తం 287 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి ప్రధాన అజెండాలోని 34 అంశాలను వాయిదా వేయడం జరిగిందని, 13వ అంశం పై సభ్యులు చర్చించిన పిదప సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ అంశాన్ని రద్దు పరచామని తెలిపారు. ప్రధాన అజెండాలో 172 నుండి 175 వరకు ఉన్న అంశాలపై సభ్యులు చర్చించి వాటిపై ఎంక్వయిరీ వేయాలని సూచించడమైనదని మేయర్ తెలిపారు. మిగిలిన 222 ప్రధాన అంశాలతో పాటు టేబుల్ అజెండాలోని వున్న 30 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని స్థాయి సంఘం చైర్పర్సన్ తెలిపారు.
అలాగే బీచ్ రోడ్ లో ఉన్న అనధికార దుకాణాల నుండి అద్దె వసూలు చేయాలని, టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాలు బినామీ పేర్లతో ఉన్నాయన్న సమాచారంతో వాటిపై ఎంక్వయిరీ చేసి బినామీలను తొలగించి ఎవరైతే దుకాణాలు గుత్తకు తీసుకున్నారో వారే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు.
ఈ సమావేశంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఎ.ఎమ్.ఒ.హెచ్ లు, యు సి డి ప్రాజెక్ట్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ పరిపాలన విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


