ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ప్రకటించినట్లుగానే ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతోంది.
తొలిసారి రాష్ట్రంలో రేషన్ కోసం స్మార్ట్ కార్డుల్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రక్రియను సాఫీగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రమంతా ఒకేసారి కాకుండా జిల్లాల వారీగా రేషన్ కార్డుల్ని విడుదల చేయబోతోంది.
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభించబోతున్నారు. అనంతరం ఈ నెల 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత వచ్చే నెల 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చివరిగా వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మిగిలిన బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు దశల్లో రాష్ట్రం మొత్తం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేషన్ కార్డుల జారీలో అంతకంతకూ ఆలస్యం చేస్తూ వచ్చింది. దీనికి కారణం ఈకేవైసీ పూర్తి కాకపోడం, అనర్హుల తొలగింపు వంటి కారణాలున్నాయి. వీటిని సరిచేస్తూ ఇప్పటికి కార్డుల జారీకి సిద్దమవుతోంది. ఈసారి ఈ కార్డుల ద్వారా రేషన్ పక్కదారి పట్టకుండా ఉండటం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఇందులో క్యూ ఆర్ కోడ్ ను నిక్షిప్తం చేస్తోంది. ఈ స్మార్ట్ కార్డుల్ని డూప్లికేట్ చేయడం కానీ, అక్రమాలకు వాడుకోవడం కానీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్డులపై రేషన్ దారుల్లోనూ ఆసక్తి నెలకొంది


