జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్వేలిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచింది. చిన్నారులు తమ సృజనాత్మక ఆలోచనలను వినూత్న ప్రయోగాల రూపంలో ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కార్యక్రమాన్ని విద్యాసంస్థల అధ్యక్షులు తిరుమల రెడ్డమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిత్యజీవితంలోని ప్రతి అంశం సైన్స్తో ముడిపడి ఉందని, చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం అవసరమని సూచించారు. ప్రాథమిక విభాగం బాధ్యులు మాధవి మాట్లాడుతూ చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ప్రదర్శనలు సిద్ధం చేయడం అభినందనీయమన్నారు.
నాలుగో తరగతి విద్యార్థినులు పప్పుధాన్యాలతో మానవ దేహంలోని అవయవాలను రూపకల్పన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వర్షపు నీటి సంరక్షణ, వినియోగంపై రూపొందించిన నమూనాలు కూడా సందర్శకులను ఆలోచింపజేశాయి.
కార్యక్రమంలో నువ్వల శ్రీనివాసులు, యం. రమణ, వరలక్ష్మి, ప్రియాంక, ధనలక్ష్మి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Uploaded Video:


