విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను అమరావతిలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఫోరమ్ వ్యవస్థాపకుడు ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ, “సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, అక్రిడిటేషన్ జారీ వంటి అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి” అని కోరారు. అలాగే, అక్రిడిటేషన్ కమిటీలలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే అక్రిడిటేషన్లు జారీ చేస్తామని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇళ్ల స్థలాల కేటాయింపును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
పాత్రికేయుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. “జర్నలిస్టులు సమాజానికి అద్దం పడే వర్గం. వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం” అని మంత్రి లోకేష్ వెల్లడించారు.
తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ నాయకులు ఈశ్వర్ చౌదరి, ఫోరమ్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.


