( పున్నమి ప్రతినిధి)
చిత్తూరు జిల్లా విశాలాంధ్ర విలేకరులతో దురుసుగా ప్రవర్తించిన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్పై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గారికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ, విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి గారు సంయుక్తంగా సమర్పించారు.
వారి ఆరోపణల ప్రకారం, చిత్తూరు జిల్లా విలేకరులు విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించినప్పటికీ, ఆయన విలేకరులపై అవమానకరంగా మాట్లాడారట. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సిపిఐ నేతలు, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులను అవమానించడం తగదని, అధికారులు విలేకరుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు.
ఈ సంఘటనపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని వారు కోరారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.


