-మండల కార్యాలయాల సముదాయం వద్ద సౌకర్యం ఉన్నా, వినియోగానికి నోచుకోని వసతి
-పల్లెల నుంచి వచ్చిన మహిళలకు తీవ్ర ఇబ్బందులు; అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
చిట్వేలి డిసెంబర్ 11: పున్నమి ప్రతినిధి
చిట్వేల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద నిర్మించిన మలమూత్ర విసర్జనశాల మూతపడడంతో ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సౌకర్యం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన ఈ వసతిని అధికారులు కొద్ది రోజులకే వినియోగానికి దూరం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
-నిర్మాణం – నిరుపయోగం:
మండల కార్యాలయాల సముదాయానికి వచ్చిన ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు ఈ మరుగుదొడ్లను పంచాయతీ అధికారులు 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించారు. కానీ, నిర్మించిన కొద్ది రోజుల తర్వాతే దాన్ని మూసివేశారు.
ప్రస్తుతం మలమూత్ర విసర్జనశాల మూతపడి ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చిన మహిళలు తమ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసివేసిన ప్రాంతాన్ని పూడిక వేసి, నిరుపయోగంగా మార్చివేయడం ఈ సమస్యకు ప్రధాన కారణం. మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, మహిళలు ఈ ప్రాంతంలో తమ అవసరాలు తీర్చుకోడానికి తగిన వసతి లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
-ప్రజల డిమాండ్:
ప్రభుత్వ లక్ష్యాల మేరకు ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు, వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా, ప్రజల కష్టాలు తీర్చేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.


