*ఘనంగా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి జన్మదిన మహోత్సవాలు*
*విశాఖపట్నం,పున్నమి ప్రతినిధి*:
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని, శనివారం పీఠ ప్రాంగణంలో భక్తిశ్రద్ధల మధ్య జన్మదిన మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం తొలిపూట నుంచే పీఠంలోని దేవాలయాలలో వేదమంత్రాల నడుమ మంగళవాద్యాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో మహాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం నిర్వహించి, పుష్పాలతో విశేష అలంకారం చేశారు.
తరువాత ఋత్వికుల వేదఘోషల మధ్య సుబ్రహ్మణ్య హోమం, ఆయుష్ హోమం నిర్వహించారు. వేద పండితుల వేదపారాయణం, మంత్రోచ్చారణలతో పీఠ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం పీఠ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది మహిళలకు ఉచిత చీరల పంపిణీ చేపట్టారు. పీఠాధిపతుల ఆశీస్సులతో పీఠం సిబ్బంది మహిళలకు చీరలు అందజేశారు.
ఈ సందర్భంగా పీఠ ప్రతినిధులు మాట్లాడుతూ —
“పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులు. ఆయన ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ రోజును భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటారు. పీఠం ద్వారా అనేక సేవా, విద్యా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి” అని తెలిపారు.
పీఠంలోని వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పీఠ పాలిత ఆలయాలు మరియు పీఠ వివిధ శాఖలలో కూడా ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.


