హైదరాబాద్
పున్నమి ప్రత్యేక ప్రతి నిధి
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గత 12 ఏళ్లుగా ఒక ఇల్లు కూడా కేంద్ర పథకాల కింద మంజూరు కాలేదని పేర్కొంటూ, కనీసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా 3 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పొంగులేటి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో గృహనిర్మాణ పరిస్థితులు, పెండింగ్ డిమాండ్, కేంద్ర పథకాల కేటాయింపులపై ఆయన సమగ్ర వివరాలు అందించారు.
2014 నుంచి 2023 వరకు దాదాపు పదేళ్ల కాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణం జరగలేదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదని విమర్శించారు. సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్ల నిర్మాణం కూడా జరగలేదని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో భారీగా గృహ అవసరం పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం పేదల గృహనిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ‘ఇందిరమ్మ ఇండ్లు’ మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్రం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 1.0లో భాగస్వామ్యం కాలేదని మంత్రి వివరించారు. 2023 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం PMAY-G 2.0లో రాష్ట్రం అధికారికంగా చేరిందన్నారు.
2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం PMAY-G 2.0కు ఆమోదం తెలిపి, ఆవాస్+2018 సర్వే ఆధారంగా ఇతర రాష్ట్రాలకు 1.19 కోట్ల గృహాలను కేటాయించిందని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం PMAY-G 1.0లో భాగం కాకపోవడంతో 2018 పెండింగ్ డేటా లేకపోయిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్ సిద్ధం చేసిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే చేపట్టి 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు వెల్లడించారు.
గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల ఇండ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని మంత్రి పొంగులేటి అధికారికంగా కోరారు.
పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గృహాలను మంజూరు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.



