గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా చిట్వేల్ మండల నాయకులు, కార్యకర్తలతో బుధవారం రోజున ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రైల్వే కోడూరు పట్టణం రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిట్వేల్ మండలానికి చెందిన గ్రామ, పంచాయతీ నాయకులు పాల్గొని తమ గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యలు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గ్రావెల్ రోడ్లు, పాఠశాలల మౌలిక వసతులు, పంచాయతీ స్థాయి సమస్యలను వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అమలు చేయడానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన ముక్కా రూపానంద రెడ్డి, గ్రామస్థాయిలో టీడీపీని మరింత బలంగా నిలబెట్టేందుకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు.



