*గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు:పవన్*
అమరావతి పున్నమి ప్రతినిధి:- పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్లామని పవన్ దిశానిర్దేశం చేశారు.
జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయిలో ఐదుగురితో కమిటీని నియమించాలని.. గ్రామాభివృద్ధిలో వారు భాగమయ్యేలా చేద్దామన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నామినేటెడ్ పదవులపైనా పవన్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జనసేన పొందిన పదవుల వివరాలను పవన్ పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై ఆయన పలు సూచనలు చేశారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకెళ్లడంతో పాటు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలు అందించే దిశగా ప్రయాణిస్తున్నామని చెప్పారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్స్ట్ఫిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలని పవన్ స్పష్టం చేశారు. ఈ విభాగంలో 11 మంది వరకూ సభ్యులను నియమించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలన్నారు.
అయిదుగురు సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్ఠంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలని చెప్పారు. 11మంది సభ్యులు ఉండే కమిటీలో ముగ్గురు వీర మహిళలకు స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు.


