ఖమ్మం, అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి):
గోమాత రక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గోరక్షకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెడ్చెల్ జిల్లా ఘట్కేసర్ వద్ద గోరక్షకుడు సోను (ప్రశాంత్)పై ఎంఐఎం గుండాలు తుపాకీ కాల్పులు జరిపిన ఘటనకు వ్యతిరేకంగా గురువారం ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాత మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీక అని పేర్కొన్నారు. గోరక్షకులు సమాజ సేవలో నిమగ్నమై ఉంటే వారిపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, గోరక్షకుల భద్రతకు చట్ట పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు.
జిల్లాలో గో సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసి, అక్రమ రవాణా, గోవుల హత్యలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. గోశాలలకు మేత, నీరు, వైద్య సేవలు వంటి ప్రాథమిక సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. గోమాత రక్షణ కేవలం ధార్మిక కర్తవ్యం కాక, సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ వినతిని స్వీకరించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


