*గుడివాడ శాంతినగర్లో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయండి*
*మున్సిపల్ కమిషనర్కు మంత్రి కొడాలి నాని ఆదేశం*
గుడివాడ పట్టణం శాంతినగర్లో 2 వ రైతుబజార్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ
మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. గురువారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రైతుబజార్
ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో గతంలో గుడివాడ రైతుబజార్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు రైతుబజార్ కు కూరగాయలను తెచ్చి విక్రయిస్తున్నారని,
స్టాల్స్ చాలక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యం 10 వేల మందికి పైగా వినియోగదారులు
రైతుబజార్కు వస్తుంటారన్నారు. అయితే పట్టణంలో ఒకచోట మాత్రమే రైతుబజార్ ఉండడంతో పరిసర
ప్రాంతాల ప్రజలు కూరగాయలను కొనుగోలు చేయాలంటే రైతుబజార్ ఉన్న ప్రాంతానికి రావాల్సిన
పరిస్థితి ఏర్పడింది. రైతులు, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుడివాడ పట్టణం శాంతినగర్లోని మంచినీటి రిజర్వాయర్ సమీపంలో 2 వ రైతుబజార్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ
2 వ రైతుబజార్లో 16 నుండి 20 స్టాల్స్ ఉంటాయన్నారు. నాగవరప్పాడు, వలివర్తిపాడు, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులకు ఈ 2 వ రైతుబజార్ అనుకూలంగా ఉంటుందన్నారు. తక్కువ సమయంలో, రవాణా
ఖర్చుల భారం లేకుండా రైతులు తమ కూరగాయలను రైతుబజార్ కు తెచ్చి అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు.
మరోవైపు శాంతినగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు కూడా 2 వ రైతుబజార్ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. 2వ రైతుబజార్లో స్టాల్స్ నిర్మాణానికి రూ. 40 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి తనకు అందజేయాలని, ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యేలా చూస్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రైతుబజార్లో స్టాల్స్ కొరత ఉందని, 2 వ రైతుబజార్ ఏర్పాటైతే మరికొంత మంది రైతులు తాము పండించే కూరగాయలను కూడా విక్రయించే అవకాశం ఏర్పడుతుందన్నారు.
వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు అతి తక్కువ ధరలకే అందుతాయని చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శాంతినగర్ ప్రాంతంలో 2 వ రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను
సిద్ధం చేయాలని మంత్రి కొడాలి నాని ఆదేశించారన్నారు. అంచనాలను వెంటనే రూపొందించి నివేదికను
మంత్రి కొడాలి నానికి అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ సంపత్
కుమార్ తెలిపారు.