విశాఖపట్నం గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాక అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కె.వెంకట్రావుపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టిన అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మెమో నెంబర్ 3098470/Vig-1/2026, తేదీ 08-01-2026తో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో పాటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు, పీనాల్టీలు, అభివృద్ధి చార్జీలు వసూలు చేయకపోవడం వల్ల జీవీఎంసీ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. గాజువాక జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైళ్ల నిర్వహణ, బిల్డింగ్ ప్లాన్ల ఆమోదం, అనుమతుల మంజూరులో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదోవ పట్టించారా? విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం జరిగిందా? అన్న అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో దోషాలు నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.




