గాజువాక డిసెంబర్ : (పున్నమి ప్రతినిధి)
విశాఖ నగర ఉత్తర భాగంలోని గాజువాక ప్రాంతం మరో ప్రతిష్టాత్మక గుర్తింపును సొంతం చేసుకుంది. సెలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రవేశద్వారం వద్ద నిర్మితమైన సెలెస్ట్ మాల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక డిజైన్తో నిర్మితమైన ఈ మాల్ నాలుగు అంతస్తుల్లో విస్తరించి సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్, లైఫ్స్టైల్, వినోద సదుపాయాలను ఒకేచోట అందిస్తోంది. గాజువాకతో పాటు పరిసర నియోజకవర్గాల ప్రజలకు ఇది ప్రధాన షాపింగ్ గమ్యస్థానంగా మారనుంది. డొమినోస్, మెక్డొనాల్డ్స్, వి2 రిటైల్, ఎంఎస్ రావు హోమ్ ఫర్నిషింగ్స్, రిలయన్స్ ఫ్యాషన్, కియాసా, వోగ్, అర్బన్ సెలూన్, ఆకాష్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. భోజనం నుంచి ఫ్యాషన్ వరకు, రిటైల్ నుంచి విద్య వరకు అన్ని అవసరాలు ఒకే మాల్లో లభించడం విశేషం. వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ఫుడ్ కోర్ట్, కుటుంబ సమేతంగా సమయం గడిపేందుకు అనువైన వినోద ప్లే జోన్తో పాటు మరిన్ని ప్రముఖ బ్రాండ్లు త్వరలో ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే రిటైలర్ల నుంచి భారీ స్పందన లభిస్తుండగా, వివిధ అంతస్తుల్లో షాపుల ఏర్పాటుకు అనేక బ్రాండ్లు చర్చలు జరుపుతున్నాయి. ఇదే సందర్భంగా సెలెస్ట్ మాల్ ప్రాంగణంలో డిసెంబర్ 22 నుంచి 28 వరకు గ్రాండ్ క్రిస్మస్ కార్నివాల్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జరగనున్న టాలెంట్ హంట్ కార్యక్రమానికి ప్రముఖ మాస్టర్ లుక్స్ రాజశేఖర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనుండగా, పెద్ద సంఖ్యలో యువత దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సెలెస్ట్ మాల్ ప్రారంభంతో గాజువాక ప్రాంతం రిటైల్, వినోద రంగాల్లో కొత్త ఉత్సాహాన్ని పొందనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


