గంజాయి అడ్డాల నుండి పరిశ్రమల గడ్డగా శ్రీకాకుళం – మంత్రి అచ్చెన్నాయుడు
అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉత్తరాంధ్ర గంజాయి అడ్డాగా మారిందని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఈగిల్’ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరిస్తూ, సమాజం అంతా బాధ్యతగా ముందుకొచ్చి ఈ సమస్యను నిర్మూలించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్, మానసిక నిపుణురాలు అఖిల తదితరులు కూడా మాట్లాడారు. ప్రతి కళాశాలలో ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ సమాచారం కోసం టోల్ఫ్రీ 1972 నెంబర్కి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఘనంగా నిర్వహించిన ర్యాలీలో ప్రతిజ్ఞా కార్యక్రమం, సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.