ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మంలో సీపీఐ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు వినోద్ రావు తండ్రా తీవ్రంగా ఖండించారు. బీజేపీని పూర్తిగా తుడిచిపెట్టాలంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజకీయ ఆత్మవిశ్వాసం కాదని, అది రాజకీయ అసహనం, నిరాశకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఖమ్మంలో బీజేపీ ఒక్క సర్పంచ్ స్థానం కూడా గెలుచుకోలేదన్న వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని పేర్కొన్న వినోద్ రావు, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీకి 1.20 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో దాదాపు 99 శాతం బూత్లలో బీజేపీ ఓట్లు సాధించడం చారిత్రక విజయమని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అవమానించేలా మాట్లాడడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటూ పిలుపునివ్వడం ద్వారా కాంగ్రెస్–సీపీఐల దేశవిరోధి రాజకీయ ధోరణి మరోసారి బయటపడిందని ఆరోపించారు.
భద్రాచలం రామమందిరానికి కేంద్రం నిధులు ఇవ్వలేదన్న వ్యాఖ్యలను వినోద్ రావు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ప్రసాద్ పథకం కింద భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి సుమారు రూ.90 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. అలాగే 2022లో భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పారు.
రామాయణ సర్క్యూట్ అభివృద్ధిలో భాగంగా భద్రాచలం కీలకంగా మారిందని, అయోధ్య తరహా ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఇప్పటికే అమలులో ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రసాద్ పథకం కింద పూర్తి స్థాయి ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదని విమర్శించారు.
భద్రాచలం శ్రీరాముడు రాజకీయాలకు అతీతుడని, ఆయన పేరుతో అబద్ధాలు ప్రచారం చేయడం తగదని వినోద్ రావు తండ్రా హితవు పలికారు. ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మవద్దని, ఖమ్మం జిల్లా సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీజేపీ బలంగా ఎదుగుతోందని తెలిపారు. బీజేపీ ప్రయాణం ఖమ్మంలో ఇప్పుడే ప్రారంభమైందని, దాన్ని ఎలాంటి ప్రసంగాలు ఆపలేవని స్పష్టం చేశారు.



