ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్: ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రీమియం విషయంలో కాకినాడ జిల్లా రైతులపై అదనపు భారం పడుతోంది. విపత్తులతో పంట దెబ్బతింటే రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా అమలు చేస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బీమా ప్రీమియం ఎకరానికు రూ.76 కాగా, కాకినాడ జిల్లాలో మాత్రం రూ.736గా ఉంది. పక్క జిల్లాలో తక్కువ ఉండి, ఇక్కడ ఎక్కువ ఎలా వసూలు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 80 శాతం వరకు కౌలురైతులే ఖరీఫ్లో సాగు చేస్తున్నారు. వీరిపై బీమా భారం పడుతోంది. కోనసీమ జిల్లాలో టాటా కంపెనీ బీమా అమలు చేస్తుండగా, కాకినాడలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇప్పటికి 25,200 ఎకరాల నమోదు
ఖరీఫ్లో 2లక్షల ఎకరాల్లో వరి సాగు మొదలుకాగా, ఇప్పటికి 25,200 ఎకరాలు మాత్రమే పంటల బీమా పోర్టల్లో నమోదైంది. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న రైతులకు ఆటోమేటిక్గా ఆ సంస్థలు ఫసల్ బీమాలో నమోదు చేస్తున్నాయి. రుణం పొందలేని రైతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కౌలురైతుల్లో 50 శాతం మందికి కూడా సీసీఆర్సీ కార్డులు జారీ కాలేదు. వీరిలో అతి తక్కువ మందికి పంట రుణాలు కల్పించారు.
వీఏఏ లాగిన్లలో కనిపించని భూమి వివరాలు
రుణాలు పొందని రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకుడు(వీఏఏ) పంట సాగుచేస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం ఇస్తేనే కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లో బీమాకు అవకాశం ఉంది. వీఏఏ లాగిన్లలో సదరు భూమి సర్వే నంబర్లు, ఖాతాలు కనిపించడంలేదు. దీంతో చాలా మంది ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులు వెళ్లగా.. సాంకేతిక లోపాలను సరిదిద్దుతూ ఈ నెలాఖరు వరకు బీమా నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులు చొరవ తీసుకుని ప్రీమియం భారం తగ్గేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.
కంపెనీల కొటేషన్ ఆధారంగానే..
దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదించగా ప్రీమియం విషయంలో వ్యత్యాసాలు ఆయా బీమా కంపెనీలు కొటేషన్ ఆధారంగా ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా అర్హులందరూ పంట బీమాలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సాగు విస్తీర్ణం – 2.10 లక్షలు ఎకరాలు
బీమాలో నమోదైన పంట – 25,200 ఎకరాలు
బీమా చేయించుకున్న రైతులు 20,821
దాఖలు చేసిన దరఖాస్తులు 34,775
వీటిలో రుణం పొందినివి – 34,058
రుణం పొందనవి – 717


