అనకాపల్లి జిల్లా, జనవరి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్):
అనకాపల్లి ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారు, రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ గారు, ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయకుమార్ గారు తదితర ప్రజాప్రతినిధులు హాజరై ఉత్సవాలకు శోభను చేకూర్చారు.
ఈ సందర్భంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన బోటు షికారీ, సెల్ఫీ పాయింట్ను వారు సందర్శించారు. అక్కడ అమలులో ఉన్న పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కొండకర్ల ఆవ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను సందర్శించి స్థానిక కళాకారులు, స్వయం సహాయక సంఘాల ద్వారా తయారైన వస్తువులను పరిశీలించారు.
కొండకర్ల ఆవను పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, దీని ద్వారా స్థానిక మత్స్యకారులు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.



