అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్య కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది రామానుజన్ చిత్రపటానికి వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ 1887 డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత, గణిత శాస్త్రవేత్త, గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ తమిళనాడులో జన్మించారని, గణితశాస్త్రంలో స్వయంకృషితో అద్భుతాలు చేపట్టారని అన్నారు. గణిత శాస్త్రంలో రామానుజన్ అద్భుతమైన కృషి చేశారని, ఆయన ఆలోచనలు, ఫార్ములాలు ఎంతోమంది మేధావులను ఆశ్చర్యపరిచాయన్నారు. గణితం యొక్క ప్రాముఖ్యతను ఆయన దేశం మొత్తం చాటి చెప్పారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2012 లో అప్పటి భారత ప్రభుత్వం ఆయన జన్మదినం అయిన డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారన్నారు. విద్యార్థులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అనంతరం మ్యాథ్స్ డే సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు వేసిన రామానుజన్ చిత్రపటం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


