గాజువాక: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ విశాఖను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. జీవీఎంసీ 70వ వార్డు శ్రీనివాస నగర్లో సుమారు రూ.6.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి చందు తో కలిసి ఎమ్మెల్యే, నగర మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇందుకు ఇటీవల నగరానికి వరుసగా వస్తున్న ప్రముఖ సంస్థలే కారణమని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు నాయకులు కొయిలాడ శంకరరావు, ఆడారి రామకృష్ణ, కృష్ణంరాజు, జెడ్సి శేషాద్రి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు.


