గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. పాత గాజువాకలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోందని, సమస్యల పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో ఉద్యమాలకు దిగడం సమంజసం కాదన్నారు. గత వైకాపా పాలనలో గాడితప్పిన పలు వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా చక్కదిద్దుతోందని, అయితే విపక్షాలు రాజకీయ లాభం కోసం విషప్రచారం చేస్తూ ఉద్యోగులను ఉద్యమాల వైపు ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాలను సదుపాయాలతో అభివృద్ధి పరచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో శనివారం కాకినాడలో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి సంఘటన స్థలానికి వెళ్లడం ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, విల్లా రామ్మోహన్ కుమార్, బలగా బాలు నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.



