కరోనా’ కట్టడికి.. నవ సూత్రాల అమలు తప్పదు మరి!
కరోనా ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ అనేది అద్భుతమైన ప్రయోగం. అయితే లాక్ డౌన్ విజయవంతం కావాలంటే దానికి కొన్ని ప్రత్యేక ఉద్దీపన చర్యలు చేపట్టాలి. అప్పుడే మన దేశంలో కరోనాకు శాశ్వతంగా
కళ్లెం వేయొచ్చు. ప్రభుత్వ ఉద్దీపన చర్యలు ప్రజలకు నేరుగా చేరిన రోజు నే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలవుతాయి. కరోనాకు పేద, మధ్యతరగతి, ధనిక బేధాలు ఉండవు. అది అందరినీ కబళించి వేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఉద్దీపన చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా, అది బ్రెయిన్ ట్యూమర్ రోగికి అమృతాంజనం రాసిన చందంగా ఉంది.
పేదోడికి పని లేకపోతే పూట గడవదు. మధ్య తరగతికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే ఇల్లు జరగదు. ధనికుడికి వ్యాపారం, పరిశ్రమలు నడవకపోతే మనుగడ ఉండదు. అయితే మన ప్రభుత్వాలు చేపట్టే ఉద్దీపన చర్యలు అందరినీ ఆదుకునే పరిస్థితి కనబడటం లేదు. ఈ మూడు వర్గాల్లో ఏ వర్గం దెబ్బతిన్నా, దాని ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతుంది. అందరినీ నాశనం చేస్తుంది. అంటే పరిశ్రమకు ప్రోత్సాహం లేకపోతే మూత పడుతుంది. తద్వారా కార్మికులు, ఉద్యోగులను నిరుద్యోగం వెంటాడుతుంది. వ్యాపారాలు దెబ్బతింటే అది పూడ్చు కోవడానికి ధరలు పెంచుతారు. అవన్నీ మళ్లీ సామాన్యుడి నడ్డి విరుస్తాయి. అందుకే ప్రభుత్వ ఉద్దీపన చర్యలు అన్ని వర్గాలను కాపాడే విధంగా ఉండాలి. ప్రస్తుతం చేపట్టిన ఉద్దేపన చర్యలో భాగంగా కేంద్ర ప్రభ్యుత్వం జన్ ధన్ ఖాతాల్లో వేసిన 500 రూపాయల డబ్బులు కోసం జనం మళ్లీ రోడ్లపైకి వచ్చి, బ్యాంకుల వద్ద బారులు తీరి కరోనాకు ఎర్ర తివాచీ పరిచారు. కొందరికి ఏ ఖాతాలో పడ్డాయో కూడా తెలియని పరిస్థితి.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈ కింది సూచించిన విధంగా ఉద్దీపనకు ఉపక్రమిస్తే లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటిస్తారు. మండలం రోజులు కాదు.. నూరు రోజుల గృహ నిర్బంధంలో నైనా ఉండి కరోనా (కోవిడ్ 19) పై విజయం సాధిస్తారు.
1. ఆకలి చావు లేకుండా అందరికీ నిత్యావసర సరకులు కిట్లు రూపంలో ప్రభుత్వమే నేరుగా ఇంటికి చేర్చాలి. పాలు, గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటే దానికి నెల రోజులు అదనంగా పంపిణీ చేయాలి. అప్పుడు ఎవరూ బయటకురారు.
2. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వమే విద్యుత్, కేబుల్, నెట్ చార్జీలు చెల్లించాలి. లేదా మాఫీ చేయాలి. జియో కంపెనీ ఆరు నెలలు ఫ్రీగా ఇస్తే వారికి వచ్చిన నష్టం ఏమీలేదు పైగా కొన్ని కోట్ల వినియోగదారులను కూడగట్టుకోగలిగింది. ఇది ప్రభుత్వ రంగ బిఎస్ ఎన్ ఎల్ ఎందుకు చేయకూడదు.
3. రుణాలపై మారటోరియం కాకుండా, లాక్ డౌన్ సమయం ఉన్నంత కాలం ఆ సమయంలో చెల్లించాల్సిన నెలసరి వాయిదాలు ప్రభుత్వం తరపున చెల్లించడం గానీ, రుణ మాఫీ చేయడం గానీ జరగాలి.
ఇది పేద, మధ్య, పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అనే తేడా ఉండకూడదు.
4. దీర్ఘకాలిక రోగ గ్రస్థులు, అనారోగ్య పీడితులకు టెలీ మెడిసిన్ సలహాలు అందించి, నేరుగా ఇంటికే ఉచితంగా మందులను పంపాలి.
5. ప్రవేటు ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులకు లాక్ డౌన్ కాలాన్ని హోమ్ సిక్ గా పరిగణించి, ఈ ఎస్ ఐ ద్వారా వేతన భృతిని విడుదల చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రంగంలో ఉన్న సంస్థలపై భారం పడదు, పైగా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది.
6. సమాచార, ప్రసార మాధ్యమాల్లో పని చేసే వారికి కూడా, వైద్య, రక్షణ రంగాల్లో వారికి ఇచ్చే కోవిడ్-19 పాలసీని అమలు చేసి బీమా సదుపాయం కల్పించాలి.
7. కోవిడ్ కాలంలో ప్రవేటు ఆస్పత్రులు, వైద్యులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్య సేవలు అందించాలి.
8. ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసి, ఎవరినీ ఇంటి నుంచి కదలకుండా చూడాలి. అందుకు దేశ రక్షణ రంగ, ర్యాపిడ్ ఫోర్సులను దించి, కఠిన నిబంధనలు అమలు చేయాలి. కర్ఫ్యూ విధించాలి. సడలింపులకు తావివ్వకూడదు.
9. సామాజిక దూరం అనే పదాన్ని తొలగించి భౌతిక దూరం పాటించేలా, భవిష్యత్తులోనూ అది అన్ని చోట్లా అమలయ్యేలా చూడాలి.
పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అన్నట్టు, కరోనా కట్టడికి నవ సూత్రాలు పాటిస్తే భారత్ ప్రజలు భరోసాగా బతుకుతూ, బంగారు భవితకు బాటలు వేసుకోగలరు.
ఇన్ని చేయాలంటే ప్రభుత్వానికి ప్రస్తుతం కాస్త కష్టతరమనిపించినా, సుభిక్ష భారత్ కావాలంటే తప్పదు మరి. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన ఋణాలకంటే 100 రోజుల ఈ దీక్షకు ప్రజలకు ఖర్చు పెట్టే ఈ మొత్తం పెద్ద భారమేమీ కాదు. డబ్భు దేముంది రేపు లాక్ డౌన్ ఎత్తి వేశాక, దేశ ఆర్థిక పరిపుష్టికి కాస్త ధరలు పెంచినా, దాన్ని ప్రజలు సంతోషంగా స్వీకరిస్తారు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వాన్ని పెద్దగా తప్పు పట్టరు. ఇందులో రాజకీయ కోణాలు మానుకొని అందరూ ఏకతాటిపైకి వస్తే దీనిని దిగ్విజయంగా అమలు చేయవచ్చు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సామెతను నిజం చేయవచ్చు.
@ వేగోరే
(వేణుగోపాల్ రెడ్డి ద్వారం),
సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు.
9705388544