కండలేరు జలాశయం స్పిల్ వే ను పరిశీలించిన సోమిరెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయం స్పిల్ వే ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటికే 60 టీఎంసీలు నీరు నిల్వ ఉండటంతో ఆయన స్పిల్ వే ను పరిశీలించారు. స్పిల్ వే నుంచి అవుట్ ఫ్లో వెళ్లే మార్గం లేకపోవడంతో డ్యాం క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. కండలేరు డ్యామ్ లోకి నీటి ప్రవాహం పెరిగి అత్యవసర పరిస్థితిలో స్పిల్ వే గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కింద నున్న గ్రామాల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
స్పిల్ వే నుంచి నీరు వెళ్లే మార్గం 12 కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందని, అందులో 560 మీటర్లు ఫారెస్ట్ లో తీయాల్సి ఉందని అందుకు రూ.95 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సోమిరెడ్డికి వివరించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధుల సాధన కోసం కృషి చేస్తానని ఈ సందర్బంగా సోమిరెడ్డి పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో నీటిపారుదల శాఖను మూత వేయడంతో ఈ దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు.


