ప్రజల మౌనం – పాలకుల సౌకర్యం
– పార్టీలు కాదు పదవులే లక్ష్యం గా మారిన నేతల సంస్కృతి
– కాంట్రాక్టులు, కమిషన్లకే పరిమితమైన అభివృద్ధి పేరుతో దోపిడీ పాలన
– ప్రజల మౌనం నాయకుల అహంకారానికి బలంగా మారిన అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాజకీయాల వైఖరి ప్రజాస్వామ్యానికి అద్దం పట్టినట్లుంది. ప్రభుత్వాలు మారినా, నేతల ధోరణి మాత్రం మారడం లేదు. ఎవరు అధికారంలోకి వస్తే, వెంటనే అదే పార్టీలో చేరిపోవడం ఇక్కడి రాజకీయాల కొత్త సంస్కృతిగా మారింది. నిన్నటి వరకు నోటికి వచ్చినట్లు విమర్శలు చేసినా, ఈ రోజు అదే పార్టీ జెండా కప్పుకొని తిరగడం వీరికి బిడియం అనిపించడం లేదు. పార్టీ కోసం మొదటినుంచి కష్టపడ్డ నాయకులను పక్కన పెట్టి, కేవలం అధికార స్వార్థం కోసం పార్టీలోకి దూకినవారే ఇప్పుడు కీలక స్థానాల్లో కూర్చున్నారు. ఇక్కడ పాలన ఒక కొత్త రూపం తీసుకుంది – అధికారమే రాజ్యం, అభివృద్ధి పేరుతో మంజూరైన పనులు, కాంట్రాక్టులు, సదుపాయాలు కొందరి చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎవరికి పనులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది కిందస్థాయి నేతలే నిర్ణయిస్తున్నారు. వాటాల్లో వాటాలు ముందే ఖరారు చేసే ఈ దోపిడీ వ్యవస్థ వల్ల ప్రజా నిధులు కాజేయబడుతున్నాయి. ఇటీవల ఒక ఇంజనీర్ తన మనసులోని బాధను మీడియా ప్రతినిధులతో పంచుకుంటూ.. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లను ఎవరూ ప్రశ్నించరు. చివరికి బాధ మాదే అవుతుంది. అని వాపోయారు. ఆ వాక్యం ఒక్కటే చాలనిపిస్తుంది, అశ్వారావుపేటలో పాలన ఎంత దిగజారిందో అర్థమవ్వడానికి. రోడ్లు నాశనమయ్యాయి, పనులు ఆగిపోయాయి, ప్రజలు మౌనంగా చూస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ దోపిడీ మాత్రమే. అధికార దాహం అనే విషం ప్రజా అభివృద్ధి శరీరాన్ని నశింపజేస్తోంది. ప్రజల ఓటు అనేది కేవలం గుర్తు వేయడం కాదు, అది ఒక బాధ్యత. ఇకనైనా ప్రజలు ఈ నీచ రాజకీయాలను తిరస్కరించకపోతే, అభివృద్ధి కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. అశ్వారావుపేటకు మార్పు అవసరం ఉంది – అధికార దాహం కాదు, ప్రజా సేవే రాజకీయ ధర్మం కావాలి.


