మంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ – 787 గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తరలింపు, 551 వైద్య శిబిరాలు ఏర్పాటు
మంథా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో గర్భిణీ స్త్రీల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెలివరీ తేదీకి వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న 787 మంది గర్భిణీలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
ఇందులో : కృష్ణా జిల్లాలో 240 మంది,
ఏలూరు జిల్లాలో 171 మంది,
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 150 మంది,
తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణీలు ఉన్నారు.
ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న గర్భిణీలకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా 551 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల వైద్య, అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు.


