*ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం*
*గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి*
*ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా*
*ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది*
*స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం*
*సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్*
*న్యూఢిల్లీ* నవంబర్ (విశాఖ పున్నమి ప్రతినిధి)
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో జరగబోయే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఇక్కడకు వచ్చాను. రాష్ట్రం కోసం యువగళం పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ఎదురైన అనేక సంఘటనలు నన్ను తీర్చిదిద్దాయి. పాదయాత్ర సమయంలో గంగాధర నెల్లూరులో మోహన అనే మహిళతో మాట్లాడాను. తన భర్త మద్యానికి బానిసై చనిపోయాడని, రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని సదరు మహిళను అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఆ సమయంలో యువత అంతా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగారు.
*గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి*
ఎన్నికల సమయంలో మేం ఆరు హామీలు ఇచ్చాం. మొదటి హామీ కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పాం. ఇది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. ఇది మా యువతకు ఇచ్చిన ప్రమాణం. దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేపట్టని ఎంప్లాయిమెంట్ విషన్ ఇది. అందుకే మేం రూపొందించిన ప్రతి పాలసీ కూడా ఉద్యోగాల సృష్టికోసమే రూపొందించాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. గత 16 నెలల్లో 120 బిలయన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇవి కేవలం సంతకాలకి పరిమితమైన ఎంవోయూలు కావు. నిజమైన ప్రాజెక్టులు. కొన్ని ప్రాజెక్టులకు ఎంవోయూలు కూడా కుదుర్చుకోలేదు. ఉదాహరణకు ఆర్సెలర్ మిట్టల్. దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం. ఆర్సెలర్ మిట్టల్ తో మేం ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఆదిత్య మిట్టల్ తో ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆ సంస్థ వచ్చింది. మరో ఉదాహరణ గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సిటీ విశాఖకు వచ్చింది. దేశంలోనే ప్రముఖ 10 సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో 5 సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ ను స్థాపిస్తోంది. ఎన్టీపీసీ రూ.1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేస్తోంది.
*స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం*
ఈ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయనేదే ముఖ్యం. విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో కూడా పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కోసం ఏపీని ఎంచుకోవాలనే థీమ్ తో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల వేగం ఎంతో పెరిగింది. స్థానిక కంపెనీలు, ఎంఎస్ఎంఈలు కూడా వెయ్యి కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్ పాన్షన్ చేస్తున్నాయి. నెల రోజులు ఆలస్యం అయినా మొత్తం బిజినెస్ ప్లాన్ మారిపోతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ముఖ్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అందుకే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు వచ్చాయి. ఇది కేవలం ఐటీ రంగానికే కాదు. బ్లూ కాలర్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ వరకు విస్తరించింది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించిన తొలి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. వచ్చే మూడేళ్లలో 50వేల హోటల్ గదులు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
*ఏపీలో నమో(NAMO) ప్రభుత్వం ఉంది*
పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. చంద్రబాబునాయుడు గారికి అనుభవం కలిగిన మంచ్రి ట్రాక్ రికార్డ్ ఉంది. మూడోది పరిపాలన. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో నమో(NAMO) ప్రభుత్వం ఉంది. నాయుడు గారు, మోడీ గారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఈ కారణాల వల్ల యువ పారిశ్రామిక వేత్తలు ఏపీని ఎంచుకుంటున్నారు.
విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చినందుకు సీఐఐకి ధన్యవాదాలు. చంద్రబాబునాయుడు గారితో సీఐఐకి మంచి అనుబంధం ఉంది. విశాఖలో జరిగే పార్టనర్ షిప్ ఎందుకంటే.. పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, ప్రభుత్వం, ప్రజలందరూ కలిసి భవిష్యత్ అవకాశాలను పరిశీలించే వేదిక. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్సెనస్ రంగాల్లో భవిష్యత్ అవకాశాలను పరిశీలించబోతున్నాం. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ సమ్మిట్ కు రానున్నారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లీనరీ, 27 సాంకేతిక సెషన్లు, 3 స్టాండ్ అలోన్ సెషన్లు, 11 రాష్ట్ర పరమైన సెషన్లు ఉంటాయి.
*ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం*
పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే సమయంలో రూ.2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అప్పుడే దేశం విజయం సాధిస్తుంది. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. క్లస్టర్ల వారీ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.


