*ఎమ్మెల్యే గంటా హామీ నెరవేరింది.. 89వ వార్డులో రోడ్డు పనులకు మోక్షం*
*ఎస్సీ కాలనీ – కంటైనర్ యార్డు రహదారి కష్టాలకు శాశ్వత పరిష్కారం
*పనులు ప్రారంభం: హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు
*14 గ్రామాల ప్రజలకు కలగనున్న ప్రయోజనం
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి *
భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 89వ వార్డు పరిధిలోని ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే చొరవతో ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే..
89వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీ నుండి ఎయిర్పోర్ట్ (కంటైనర్ యార్డు) వైపు వెళ్లే రహదారి గత కొంతకాలంగా అత్యంత అధ్వాన్నంగా మారి, గుంతలమయమైంది. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యను గుర్తించిన బాల రాజేశ్వరరావు, గత ఏడాది జులై 28న (28-07-2024) స్వయంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని కలిసి, అక్కడి దుస్థితిని వివరించారు.
అప్పట్లో దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, త్వరలోనే ఈ రోడ్డు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిధులు మంజూరవడం, ఇప్పుడు నేటినుంచి పనులు ప్రారంభం కానుండటం శుభపరిణామమని బాల రాజేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సమీపంలోని సుమారు 14 గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయి. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఇది ఎంతో ఊరటనిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా సమస్యపై తక్షణమే స్పందించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి స్థానికులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన బాల రాజేశ్వరరావు కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.


