
విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు సంయుక్త పత్రికా సమావేశం నిర్వహించారు.
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ—
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన చేపడుతున్నారని తెలిపారు.
జగన్ పర్యటనకు 65 వేల మంది వస్తారని చెప్పి, పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అనుమతి అవసరం లేదని, ప్రభుత్వం కుట్రపూరితంగా హెలికాప్టర్ అనుమతిని కూడా ఆలస్యం చేస్తోందని విమర్శించారు.
జగన్ భద్రతను ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని, మెడికల్ కాలేజీలను అడ్డుకునే “తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు” కి సమాధానం చెప్పేందుకు జగన్ వస్తున్నారని చెప్పారు.
కె.కె రాజు మాట్లాడుతూ—
జగన్ పర్యటనకు ముందే పర్మిషన్ ఇవ్వగా, నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం ప్రజల్లో జగన్ పట్ల ఉన్న ఆదరణను భరించలేకే అని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రపై వివక్షత చూపుతోందని, భూముల దారాదత్తం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్టోబర్ 9న జగన్ నర్సీపట్నం వస్తారని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సమన్వయకర్తలు మళ్లి విజయప్రసాద్, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

