విశాఖ గాజువాక , జనవరి (పున్నమి ప్రతినిధి):
విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసి ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గాజువాకలో కార్మికులు రోడ్డెక్కారు. 2026 జనవరి 4వ తేదీ ఉదయం 9 గంటలకు గాజువాక లంకా గ్రౌండ్ నందు విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ల ఆధ్వర్యంలో భిక్షాటన కార్మికం నిర్వహించారు. ఏళ్ల తరబడి కష్టపడి నిలబెట్టిన విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నాలను కార్మికులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని, పాలక కూటమి నేతలు ఉక్కు పరిరక్షణ పేరుతో మాటలకే పరిమితమయ్యారని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. “ఉక్కు పరిరక్షణ పేరిట నాటకాలు ఆడొద్దు”, “ఉక్కు అమ్మకం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం అమ్మినట్లే” అంటూ నినాదాలతో గాజువాక దద్దరిల్లింది. ఈ భిక్షాటనలో కార్మికులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని విరాళాలు అందించారు. ఉద్యమం కొనసాగించేందుకు ప్రజలే ముందుకు రావాల్సిన పరిస్థితి పాలకుల వైఫల్యానికి నిదర్శనమని నాయకులు విమర్శించారు. భిక్షాటన ద్వారా సేకరించిన నిధులను ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి వినియోగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి వెన్నెముకలాంటిదని, వేలాది కుటుంబాల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తామని హెచ్చరించారు. ఉక్కు ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిందని, గాజువాక నుంచి మొదలైన ఈ నిరసన రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతోందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.







