ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి: మన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎం. ఎస్.గిల్ ఉన్నప్పుడు విదేశీయుల నుంచి ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీరు ప్రకటించే ఫలితాలను పార్టీలన్నీ అంగీకరిస్తాయా?’ అని అడిగినవారికి- ‘భారత ఎన్నికల సంఘం పట్ల ఎప్పుడూ ఎవరూ ఎలాంటి విశ్వాసరాహిత్యాన్నీ ప్రదర్శించలేదు’ అని గిల్ సగర్వంగా సమాధానమిచ్చారు. ఈసీ మీద అంతటి నమ్మకం ఇప్పుడు ఉందా అంటే- రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్లో కూడా చాలామంది ‘లేదు’ అనే చెబుతారు. బిహార్ లో ఓటరు జాబితాల నిశిత పరిశీలన (ఎస్ఐఆర్) ప్రహసనం ప్రారంభమయ్యాక- కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కొన్నేళ్లుగా వ్యక్తమవుతున్న అనుమానాలు ఆందోళనలుగా పరిణమించాయి. ఆ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల లిస్టులోంచి తొలగించినవారి వివరాలను ప్రత్యేకంగా వెల్లడించనక్కర్లేదని, జాబితాలో ఎవరినైనా చేర్చకపోవడానికి కారణాలేంటో కూడా చెప్పక్కర్లేదని ఈసీ వాదించడంతో సందేహాలు ఇంకా బలపడ్డాయి. ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలనూ బహిరంగపరచాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సి) నిర్దేశిస్తోంది. పాలనాపరమైన, అర్ధన్యాయ తీర్మానాలకు గల కారణాలేంటో ఆ నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వివరించాలని సెక్షన్ 4(1)(డి) స్పష్టీకరిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఊపిరులూదే ఇటువంటి జవాబుదారీతనాన్ని కాలదన్నిన ఈసీకి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కనువిప్పు కలిగించేవే!
బిహార్ ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 65 లక్షల మంది వివరాలను బయటపెట్టాలంటూ మొన్న గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విశేషమైనది. ఓటర్ల లిస్టులోంచి తమను ఎందుకు తీసేశారో తెలుసుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు, ‘సుప్రీం’ ఉత్తర్వులు దానికి పట్టంకట్టాయి. ఓటింగ్ హక్కును అమూల్యమైనదిగా గతంలో పేర్కొన్న కేరళ హైకోర్టు- సంబంధిత వ్యక్తుల వాదనలను వినకుండా ఎవరి పేర్లనూ ఓటరు జాబితాలోంచి కత్తిరించకూడదని స్పష్టంచేసింది. వ్యక్తిగత అంతరాలకు అతీతంగా పౌరులందరూ ప్రజాస్వామ్యంలో కీలక పాత్రధారులే. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటూ విలువైనదే. కండబలంతో, అధికార దుర్వినియోగంతో ఎవరూ ఎన్నికల ప్రక్రియను దారితప్పించకూడదు. ప్రజాభిప్రాయ ప్రకటనను తమకు అనుకూలంగా ప్రభావితం చేయకూడదు. ఈ మేరకు గతంలోనే ఉద్ఘాటించిన న్యాయపాలిక- ఎన్నికలు స్వేచ్చగా సక్రమంగా పూర్తికావడం ప్రజాతంత్రానికి ప్రాణావసరమని పేర్కొంది. ఎలక్షన్లు ఆ విధంగా జరగాలంటే- ముందసలు ఓటర్ల లిస్టులు సక్రమంగా ఉండాలి. వాటిని అలా రూపొందించడంలో ఈసీ ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తుండటమే దేశ ప్రారబ్ధం!
అన్ని పార్టీలకూ సమదూరంలో ఉంటూ పారదర్శకంగా పనిచేయడం- ఈసీ శిరసావహించాల్సిన సంవిధాన కట్టుబాటు. ఎన్నికల సంఘం చేతల్లో రాజీలేని స్వతంత్రత, నిష్పాక్షికత, నిజాయతీ ఉట్టిపడాలి. ఎన్నికల నిర్వహణకుగానూ తనకు దఖలుపడిన సర్వాధికారాల వినియోగంలో యుక్తాయుక్త విచక్షణతో వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా దేశీయంగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల లిస్టులోంచి అర్హుల పేర్లు గల్లంతు కావడం, అనర్హులు వచ్చిచేరడం వంటి అక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. అంగ, అర్థ బలసంపన్నుల క్రీడామైదానాలుగా మన ఎన్నికలు పరువుమాస్తున్నాయి. ఈసీ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు భారత ప్రజాస్వామ్యాన్ని ఇంకా పలుచన చేస్తున్నాయి. నైతిక నియమాలు, శాసన నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వర్తించడంలో ఈసీ నిబద్ధతే ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షిస్తుంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు రాజకీయ మకిలి అంటితే మన ప్రజాస్వామ్యం అర్థరహితమై ఆరాచకాలకు ఆలవాలమవుతుంది!


