ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
దేశ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ నాయకుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సోమవారం ఆర్ & బి అతిథి గృహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చే సమ్మిట్ను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. యువ కాంగ్రెస్ నాయకుల చర్యలు దేశ ఖ్యాతికి మచ్చతెస్తాయని విమర్శించారు. భారత్ సాంకేతిక రంగంలో ముందుకు సాగుతున్న వేళ, ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం దేశ అభివృద్ధికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ దేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తోందని, దీనిని రాజకీయ దృష్టితో చూడడం సరైంది కాదని వారు అన్నారు. దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టే ధోరణిని ప్రజలు సహించరని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఆల్లిక అంజయ్య, శ్రీమతి పమ్మి అనిత, సాయి రామ్, జ్వాలా నర్సింహా రావు, ఆచంటి కోటేశ్వరరావు, వల్లల రమేష్, ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, రుద్ర గాని మాధవ, ఆర్.వి.ఎస్. యాదవ్, నకిరికంటి వీరభద్రం, నల్ల మాస శ్రీనివాస్, మార్తినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


