ఖమ్మం పున్నమి ప్రతి nidhi
ఖమ్మం నగర పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భూములపై అక్రమ నిర్మాణాలు పెరగడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన భూములు కొంతమంది వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్తుండటంపై వ్యాపార వర్గాలు మరియు స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలర్లు, పశువుల కోసం ఉద్దేశించిన భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, ఇండస్ట్రియల్ విభాగం పరిధిలో ఉన్న కొన్ని సర్వే నంబర్ల భూములు వ్యక్తిగతంగా వినియోగించబడుతున్నాయని స్థానికులు వెల్లడించారు. అక్కడ క్రమం తప్పకుండా కొత్త నిర్మాణాలు సాగుతుండగా, అధికారులు మాత్రం దీనిపై ఏ చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు సక్రమంగా వినియోగించకపోవడం వల్ల పరిశ్రమలు ఏర్పడక, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. భూముల ఆక్రమణల వల్ల కొత్త పెట్టుబడిదారులు కూడా వెనుకడుగువేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, కొన్ని భూములపై కట్టడాలు నిర్మించబడుతూ ఉండగా, కొంత భాగం నివాస అవసరాలకు వాడుతున్నారు. ఈ అక్రమ చర్యలకు సంబంధించి అధికారులు సర్వే చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇండస్ట్రియల్ భూముల ఆక్రమణలు ఆగాలంటే, ప్రభుత్వం మరియు ఇండస్ట్రీస్ విభాగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు.


