పున్నమి:
అయ్యప్ప స్వాములకు సందేశం:
అయ్యప్ప స్వాముల దీక్ష “స్వామి” అని పిలవడంతో మొదలవుతుంది.అయితే అలా ఎందుకు పిలవాలి?
ఎందుకంటే,అందరినీ భగవంతుని ప్రతిరూపాలుగా చూడడం అలవాటు చేసుకోవాలి.ఇదే మాల ధారణంలోని మొట్ట మొదటి
నియమం.అలా చూడడం అనేది ఎంతో పవిత్రమైన దృష్టి.స్వాములు దీక్షలో బలంగా నిలబడాలంటే అందరినీ భగవంతుని ప్రతిరూపాలుగా చూడడం,”స్వామి” అని పిలవడం చాలా ముఖ్యం.
🙏 ఇక రెండవ నియమం: స్వాములు ఏ పని చేసినా అయ్యప్పను (భగవంతుణ్ణి) తలుచుకుంటూ,భక్తితో చేయాలి.స్వార్థం లేకుండా
(నాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అనే దురాశ లేకుండా) పనులు
చేయడం అలవాటు చేసుకోవాలి.ఈ నియమం అందరి స్వాములకు
వర్తిస్తుంది.
ప్రభుత్వ అధికారులైన స్వాములు మొదలుకొని,టీ బంకు,ఆటోలు నడిపే స్వాముల వరకు అందరూ అయ్యప్ప స్వామి పట్ల భక్తితో,నిస్వార్థంగా పని చేయడం అలవాటు చేసుకోవాలి.
🙏 ఇక మూడవ నియమం: స్వాములు ఏది పడితే అది తినకూడదు.ఎందుకంటే స్వాములకు ఒక నియమం ఉంది.భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని మాత్రమే తినాలి.అది కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ భక్తితో తినాలి.అలా భక్తితో తిన్న ఆహారం అమృతం అవుతుంది.ఆ అమృతం స్వాములలో దీక్షా బలాన్ని రెట్టింపు చేస్తుంది.
🙏 ఇక నాలుగవ నియమం: స్వాములు ఏ పూజ చేసినా అయ్యప్పను తలుచుకుంటూ భక్తితో చేయాలి.అయ్యప్ప పూజలలో అన్ని పూజలూ ముఖ్యమే.కానీ అయ్యప్ప భజన అనేది చాలా ముఖ్యం.ఎందుకంటే భజనలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది.
స్వాములందరూ కలిసి
“స్వామియే…అయ్యప్పో…అయ్యప్పో..స్వామియే”
అని గట్టిగా పలుకుతూ,స్మరిస్తూ ఉంటే మనస్సు కొద్ది సేపు
సమాధి స్థితిలో నిలిచిపోతుంది.అలాంటి మనస్సుకే భగవంతుడు
సాక్షాత్కరిస్తాడు.కాబట్టి స్వాములు ప్రతి రోజూ అయ్యప్ప భజనలు
భక్తితో చేస్తూ ఉండాలి.
🙏 ఇక ఐదవ నియమం: స్వాములు ఇతరులకు ఏది దానం చేసినా,భగవంతుణ్ణి తలుచుకుంటూ దానం చేయాలి.అప్పుడే
ఆ దానం సఫలమౌతుంది.
🙏 ఇక ఆరవ నియమం: స్వాములు ప్రతి రోజూ కొద్ది సేపు భగవంతుణ్ణి భక్తితో ధ్యానిస్తూ ఉండాలి.ఇలా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల స్వాములకు మనో నిగ్రహం,ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.తద్వారా స్వాముల దీక్షా బలం రెట్టింపవుతుంది.
పై ఆరు నియమాలను బాగా గమనిస్తే,మనకు ఒక విషయం తెలుస్తుంది.మనం ఏది చేసినా భగవంతుడి పట్ల భక్తితో
నిస్వార్థంగా చేయాలి అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది.అయితే అలా ఎందుకు చేయాలి? నేను నాకోసమే,నా లాభం
కోసమే పనులు చేసుకుంటాను అని కొందరు అంటారు.
ఎప్పుడైతే నువ్వు నీ కోసం మాత్రమే పనులు చేసుకుంటూ ఉంటావో,అప్పుడు నీలో అహంకారం,స్వార్థం బాగా పెరిగిపోతాయి.ఆ అహంకార స్వార్థాలే నీలో దురాశను కలిగిస్తాయి.అవే నీతో చేయకూడని పనులను చేయిస్తాయి.అవే నీ జీవితాన్ని బాగా దెబ్బతీస్తాయి.
కాబట్టి మనలోని అహంకారం భక్తిగా మారాలి.అలా మారాలంటే మనం భగవంతుడి పట్ల భక్తితో నిస్వార్థంగా పనులు చేయడం
అలవాటు చేసుకోవాలి.అప్పుడే మనం దేవుడికి దగ్గరవుతాం.అప్పుడే నలుగురికి సహాయం చేసే గుణాన్ని పొందుతాం.
||యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం||(9.27)
అర్థం: అర్జునా!..నువ్వు ఏ పని చేసినా,ఏది తిన్నా,ఏది హోమం చేసినా,ఏది దానం చేసినా,ఏ తపస్సు చేసినా,వాటన్నిటినీ నాకు సమర్పించు(మనస్ఫూర్తిగా ఇవ్వు) అని భగవంతుడు చెబుతున్నాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామియే శరణమయ్యప్ప


