– రూ. 32 లక్షలతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాప
రాజమహేంద్రవరం, నవంబర్ 11 :
అభివృద్ధికి మారు పేరుగా నగరాన్ని నిలుపుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రియాంక్ గార్డెన్స్ సమీపంలోని కొకొనట్ జ్యూస్ సెంటర్ నుంచి జాగృతి జంక్షన్ వరకూ రూ. 32 లక్షలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల కోసం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నగరంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇది తమకు… కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధన్నారు. అయితే గత ఐదేళ్లూ వైకాపా వారికి కనిపించకపోవడం శోఛనీయమన్నారు. గత పాలకులు ఏదో మెయిన్ రోడ్లు వరకే అభివృద్ధి చేయడం, విశాలంగా ఉన్న రోడ్లను ఇరుకుగా చేయడం, డివైడర్లకు రాళ్లు అంటించడంతోనే సరిపెట్టారని, వారి అనాలోచిత పనుల వల్ల నేడు నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తాము ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అందరి ఆలోచనల మేరకు అవసరమైన పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. నగరంలో దాదాపుగా 30 పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


