కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ,పున్నమి న్యూస్:
జగన్నాధపురం అన్నమ్మఘాటీ సెంటర్ వద్ద ఉన్న వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి
ఆలయంలో నాగుల చవితి పర్వదినోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త పైలా అన్నపూర్ణ సారథ్యంలో జరిగిన ఈ వేడుకలకు వేకువజామునుండే భక్తులు తరలివచ్చి స్వామివారికి పాలు, గుడ్లు, పసుపు,కుంకుమ,పూలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు హరహర సుబ్రహ్మణ్య నినాదాలతో ఆలయ ప్రాంగణంమార్మోగించారు.
పండితుల సాన్నిధ్యంలో పాలాభిషేకం,నాగప్రతిష్ఠా పూజ, నాగహోమం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం సమయంలో స్వామివారికి అలంకార మహోత్సవం,దీపాలంకరణ,మహా హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ధర్మకర్త పైలా అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ ఆలయం ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోత్సాహం,భక్తుల సహకారంతో ఈ ఆలయం పేరు ప్రఖ్యాత సాధించిందన్నారు. సహజసిద్ధంగా ఇక్కడ పాముల పుట్ట ఉండడం,సాధారణ రోజుల్లో నాగు పాము దర్శనం కావడం ఈ స్థల ప్రత్యేకత.లోకకల్యాణం కోసం సమస్త జనావళిపై శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కటాక్షం ఉండాలని మనసారా కోరుకుంటున్నాని తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పాలు గుడ్లు సమర్పించి, తమ కోరికల సాధన కోసం ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేదపారాయణం,నాగకల్యాణం నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
యువత సేవా బృందాలు భక్తుల సౌకర్యం కోసం నీటి పంపిణీ, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించాయి.భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.


