-సిద్దవటం తహసీల్దారుకు వినతిపత్రం అందచేసిన జేఏసీ నాయకులు
సిద్దవటం,డిసెంబర్ 01 పున్నమి ప్రతినిధి
సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన ఉదృతం చేస్తామని సిద్ధవటం జేఏసీ నాయకులు అన్నారు.సిద్ధవటాన్ని రాయచోటిలో కలపడం పట్ల సిద్దవటం జె.ఏ.సి సభ్యులు సోమవారం మండల వ్యాప్తంగా వందలాది మంది ప్రజల సంతాకాలు సేకరించి సిద్దవటం తహసీల్దారు ఆకుల తిరుమల బాబుకు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ సిద్దవటం మండలాన్ని యధావిధిగా కడపలోకే వుంచాలని లేదా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించి సిద్దవటం మండలాన్ని రాజంపేటలోకి కలపాలని తహసీల్దారు గారికి వినతిపత్రం అందచేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట రాయచోటి వద్దు కడప ముద్దు- రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాధాలతో హోరెత్తించారు. మండలంలోని అన్ని పార్టీల నాయకులు ఉద్యమించాలని చాలా మంది నోరు విప్పి ముందుకు రావడం లేదని ఇలాగైతే వచ్చే స్దానిక ఎలక్షన్లలో ప్రజలు తగిన బుద్ది చెపుతారని అన్నారు. ఇప్పటికైనా నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపించి పై స్దాయి నాయకులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించి సామాన్య ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న రైతులు, చేనేత కార్మికులు, విద్యావంతులు, మేధావులు, వ్యాపార వేత్తలు, స్వచ్చంద సంస్థ సభ్యులు, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ కార్యాచరణలో భాగంగా తదుపరి కడప జిల్లా కలెక్టరు గారిని కలసి వినతిపత్రం అందించ నున్నట్లు సభ్యులు తెలిపారు.


