ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ తియాంజిన్:
ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఎస్ సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరిన ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ.. జిన్పింగ్తో సమావేశం అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు.
2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జినిపింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండనుంది.


