గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయ వేదికగా అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను అందజేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. నీలవేణి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని 113 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ఒక్కోటి సుమారు రూ.12,500 విలువ గల నాణ్యమైన మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కొత్త భవనాల నిర్మాణంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


